'భద్రాచలం' గురించి తెలియని వారు వుండరనుకుంటాను. దక్షిణాది పుణ్య క్షేత్రాలలో......పేరెన్నిక కన్నది, సీతారాములను మన కళ్ళ ముందు నిలిపేదీ........' భద్రాచలం ' మాత్రమే ! అలాంటి భద్రాద్రి కి - పర్ణశాల కు మధ్యలో, భద్రాద్రి నుంచి 25 కి. మీ. దూరంలో పైకి వున్న ఊరే మా వూరు పేరు '' సున్నం బట్టి- బైరాగుల పాడు ''!
పేరు వింత గానూ కొత్తగానూ వుంది కదూ ! సరే......' దుమ్మగూడెం ' పేరు వినే వుంటారనుకుంటా . ఈ మధ్య ' ఎత్తి పోతల ' పధకాలని....' హైడ్రాల్ ప్రాజెక్టు ' అని......బాగానే వార్తలకు ఎక్కుతుంది లెండి . అదుగో ఆ మండలం లో వున్న ఊరన్న మాట . నేను చెప్ప బోయే ' డాము- లంక ' ఈ రెండు ఊర్లను ఆనుకునే వుంటుంది.
సరే...సరే దారి తప్పి మావూరి నుండి ఆ వూరు వెళ్ళిపోయాను అనుకుంటున్నారు కదూ ....అదేమీ కాదు లెండి. అసలు మా వూరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ....
సున్నం బట్టి :- సున్నం అనగా మీకు తెలుసు (lime ) మరి బట్టి అంటే తెలుసుగా కొలిమి' లాంటి ఓ పెద్ద పొయ్యి అన్నమాట. సున్నం తయారు చేసే ప్రక్రియ కు దోహదపడే ఒక సాధనం అనుకుందాం. 'అసలు సున్నం తయారు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది '.....అని మీకు సంశయం కలగవచ్చు. మీ డౌటు కరెక్టే !
ఎందుకు తయారు చేయవలసి వచ్చిందంటే అప్పట్లో ఏ కట్టడం కట్టాలన్నా ' రాయి' ' సున్నం ' తోనే కట్టేవారు కాబట్టి . అక్కడ సర్ .ఆర్థర్ కాటను మహాశయుడు ఓ వారధి ( డాము ) నిర్మించాడు కాబట్టి ! మధ్యలో ఓ చిన్న దీవి వుంది దాన్ని ఆధారంగా చేసుకుని ఆ ఒడ్డు ను ఈ ఒడ్డును కలుపుతూ రెండు ఎర్తు డాములు కట్టి ' గోదావరి ' ని అందంగా ....సున్నితం గా బంధించాడు కాటను మహాశయుడు !వర్షా కాలం లో నీరు ఆ డాముల మీదుగా పొంగి పొర్లుతూ ' రాజమండ్రి ' వైపుగా పరుగులు పెడతాయి !
హెడ్డు- లాకులు
టైలు లాకులు : అవునండీ - తోక భాగంలో వుంటాయి కాబట్టి టైలు-లాకులు అన్నారు .ఇవి ' గంగోలు ' అనే వూర్లో వున్నాయి. గోదావరి వొడ్డున... నాలుగంటే నాలుగు ఇల్లు . చుట్టూ అన్ని రకాల వృక్షాలు. ఆరు కి.మీ. దూరం...ఎడబాటు ను సహించలేని.. ఆ కాలవ పాయ ఆత్రం గా గోదావరి లో కలిసే వైనం.... చోటు... ఎప్పటి కీ మరిచి పోలేను. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. దీన్ని గురించి రాయాలంటే ఓ పెద్ద గ్రంధమే అవుతుంది. ఫోటో లతో మళ్లీ వేరే రాస్తా. ఇక్కడ కూడా మూడు అంచెలుగా మళ్లీ లాంచి గానీ.... తెప్ప గానీ.. పడవ గానీ లాకులని దాటి అప్పుడు గోదావరిలో కలుస్తాయి .అదండీ సంగతి.
అరె అసలు సంగతి మర్చిపోయాను ....' బైరాగుల పాడు ' గురించి చెప్పనే లేదు కదూ !..
బైరాగులపాడు : ' బైరాగులు ' అంటే తెలుసు కదండీ ' సన్యాసులు ' ! చెప్పాను కదండీ మా వూరు ' భద్రాద్రి ' కి పర్ణశాలకు మధ్యన వుంటుంది కాబట్టి . కాలినడకన భద్రాద్రి నుంచి బయలు దేరిన సన్యాసులు అందరూ మా వూరు మొదట్లో వున్న చింతల తోపులో ఆగి , బిక్ష చేసుకుని, తత్వాలు పాడుకుని, తిరిగి తెల్లవారే బయలుదేరి వెళ్ళేవారట ! అలా - వాళ్ళకు మజిలీ గా పనికి వొచ్చింది కాబట్టి కాల క్రమం లో '' బైరాగుల పాడు'' గా స్థిర పడిపోయింది . ఇప్పుడది ' శ్రీనివాస పురం ' గా మారింది లెండి . ఆ కధా - కమామీషు '' మా వూరి గుడి '' లో రాస్తాను లెండి .